మొబైల్ ఫోన్ను పూర్తిగా 
చార్జి చేయాలంటే ఒకటి రెండు గంటల పాటు చార్జింగ్ పెట్టాల్సి ఉంటుందనే 
విషయం తెలిసిందే! అయితే తాము అభివృద్ధి చేసిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో 
కేవలం ముప్ఫై సెకన్లలో బ్యాటరీ చార్జింగ్ పూర్తిచేయవచ్చని టెల్ అవీవ్ 
శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కేవలం మొబైల్ ఫోన్లు మాత్రమే కాదు విద్యుత్
 కార్లకు కూడా ఈ విధానంలో చార్జింగ్ పెట్టవచ్చని వారు తెలిపారు. అయితే 
దీనికి మాత్రం కొద్ది నిమిషాల సమయం తీసుకుంటుందని అన్నారు. నానో టెక్నాలజీ 
సాయంతో కృత్రిమ మాలిక్యూల్స్ను తయారుచేసి ఈ సాంకేతికతను అభివృద్ధి 
చేసినట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జాక్ వైస్ఫీల్డ్ తెలిపారు. 
దీంతోపాటు బ్యాటరీని కూడా తయారుచేశామని అన్నారు. బ్యాటరీ చార్జింగ్ అయ్యే 
పద్ధతిని వివరిస్తూ.. ఓ డస్టర్ను గట్టిగా పిండి నీటిలో ముంచితే అది నీటిని
 వేగంగా పీల్చుకొని ఒడిసిపట్టుకుంటుందని, సరిగ్గా ఈ తరహాలోనే తాము 
రూపొందించిన కొత్త బ్యాటరీ చార్జింగ్ అవుతుందన్నారు. దీంతో మొబైల్ను 
క్షణాలలో, విద్యుత్ కార్లను నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చని జాక్ 
వివరించారు. ప్రస్తుతం నమూనా రూపకల్పన పూర్తయిందని, 2016 నాటికల్లా వీటిని 
మార్కెట్లో అందుబాటులో ఉంచే ప్రయత్నంలో ఉన్నట్లు ఆయన వివరించారు.

 
No comments:
Post a Comment